
న్యూఢిల్లీ, 17 మార్చి (హి.స.)
దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు
రైల్వే శాఖ మరో భారీ శుభవార్తను అందించింది. మొత్తం 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ను విడుదల అయింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ITI), ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి, అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 15, 2026 నుంచి జూన్ 14, 2026 వరకు రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఐదు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటగా రెండు విడతల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT 1 & CBT 2) నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారికి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహిస్తారు. ఈ మూడు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కఠినమైన రైల్వే వైద్య పరీక్షలు (Medical Examination) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. రైల్వేలో స్థిరపడాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు indianrailways.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు