
హైదరాబాద్, 18 మార్చి (హి.స.)
అమెరికాలో ఉన్న వలసదారులకు
ట్రంప్ ప్రభుత్వం (Trump's government) భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని తిరిగి తమ స్వదేశాలకు పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం 'ప్రాజెక్ట్ హోమ్కిమింగ్' (Project Homecoming) అనే వినూత్న పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మే 9, 2025న అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన పై సంతకం చేశారు. స్వచ్చందంగా దేశాన్ని విడిచి వెళ్ళే అక్రమ వలసదారులకు ఆర్థిక సాయం తో పాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తొలుత 1,000 డాలర్లుగా ఉన్న ఈ నగదు ప్రోత్సాహాన్ని, జనవరి 2026 నుంచి ప్రభుత్వం 2,600 డాలర్లకు (సుమారు రూ. 2.15 లక్షల నుంచి రూ.2.40 లక్షలు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వారు 'సీబీపీ హోమ్' (CBP Home) అనే మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ఉచితంగా విమాన టిక్కెట్లు అందించడమే కాకుండా, వారు తమ స్వదేశానికి చేరుకున్నట్లు యాప్ ద్వారా ధ్రువీకరణ జరిగిన వెంటనే సదరు నగదు బోనస్ను అందజేస్తుంది. ఈ పద్ధతి ద్వారా వచ్చే వారిని అరెస్ట్ చేయకుండా, ఎటువంటి బేడీలు లేకుండా సాధారణ ప్రయాణికుల్లా గౌరవప్రదంగా పంపిస్తామని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అంతేకాకుండా, గతంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పడే జరిమానాలను కూడా ఈ పథకం కింద ప్రభుత్వం మాఫీ చేస్తుంది.బలవంతంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన ఆర్థిక కారణం ఉంది. ఒక అక్రమ వలసదారుడిని డిపోర్ట్ చేయడానికి ప్రభుత్వానికి సుమారు 18,245 డాలర్ల ఖర్చవుతుండగా, ఈ ఎగ్జిట్ బోనస్ పథకం ద్వారా కేవలం 5,100 డాలర్లతోనే పంపే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేశారు. దీనివల్ల ఒక్కో వ్యక్తిపై సుమారు 13,000 డాలర్ల మేర అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ పథకం ద్వారా లక్షలాది మంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్ళిపోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..