
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్పై జరిగిన పోలీసుల దాడి, తదనంతర పరిణామాలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
మొయినాబాద్లోని అజీజ్నగర్ పరిధిలో ఉన్న రోహిత్ రెడ్డి ఫామ్హౌస్పై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ ఫామ్హౌస్ డ్రగ్స్ కార్యాకలాపాలకు నిలయంగా మారిందనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మొయినాబాద్ పోలీసులు ఫామ్హౌస్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ నిర్వహించిన సమయంలో ఫామ్హౌస్లో జరిగిన పార్టీకి హాజరైన వారి విలాసవంతమైన వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫామ్హౌస్ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ నిర్మాణం చుట్టూ అనేక చట్టపరమైన చిక్కులు ఉన్నాయి. అజీజ్నగర్లోని సర్వే నంబర్ 177/33లో సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్హౌస్ నిర్మించారు. ఈ భూమిని 2006లో రోహిత్రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ప్రభుత్వ 'భూభారతి' రికార్డుల్లో ఈ భూమి జంగయ్య అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.
నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని విక్రయించడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. అసైన్డ్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది.? , దానికి సహకరించిన అధికారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
ఈ కేసులో పోలీసులు అత్యంత వేగంగా చర్యలు తీసుకున్నారు. రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత, నేరుగా ఫామ్హౌస్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్, విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కార్యక్రమాలు, భూ అక్రమాలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు పోలీసులు అధికారిక లేఖలు రాశారు.
గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన ఇప్పుడు వరుసగా చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాలు, అసైన్డ్ భూముల ఆక్రమణలపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోండటంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్