
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఏపీ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో స్టేట్ ఫుడ్ ల్యాబ్కి అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రస్తావించారు.
ఈరోజు(శనివారం) తిరుమలలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్దికాలం వ్యవధిలోనే తిరుమలలో పరిశోధన శాలను ప్రారంభించామని తెలిపారు. ఈ పరిశోధనశాలలో అనేక పరీక్షలు చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పాలు, నెయ్యి, నూనెతో పాటు ముడి సరుకుల నాణ్యతను పరీక్షించవచ్చని చెప్పుకొచ్చారు. రూ.25 కోట్లతో నిర్మించిన ఈ పరిశోధన శాలలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని వెల్లడించారు.
ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ పరిశోధన శాల పని చేస్తోందని వివరించారు. అప్పటి వరకు అనాలిసిస్ జరుగుతునే ఉంటుందని తెలిపారు. మూడు నెలల్లో గుంటూరు, వైజాగ్లో పరిశోధన శాలలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో 11 స్టేట్ ఫుడ్ ల్యాబ్లను ఆధునికీకరించామని అన్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీపడబోమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్