
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి,
'అమ్మ' జయలలితకు చెందిన హైదరాబాద్ నివాసాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు సీజ్ చేశారు. నగరంలోని సంపన్న ప్రాంతమైన శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి భారీగా ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గడిచిన కొంతకాలంగా ఈ నివాసానికి సంబంధించిన ఆస్తి పన్ను (Property Tax) చెల్లించలేదని సమాచారం. బకాయిల చెల్లింపుపై ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎటువంటి స్పందన లేకపోవడంతో జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు మంగళవారం ఉదయం అక్కడికి చేరుకుని ఇంటిని సీజ్ చేశారు. ప్రధాన ద్వారానికి తాళం వేసి, నోటీసును అంటించారు.
జయలలిత తన సినీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లోని ఈ నివాసంలో తరచూ గడిపేవారు. ఆమెకు ఇష్టమైన నివాసాల్లో ఇది ఒకటిగా పేరుంది. అయితే, ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వ గొడవలు, ఇతర కారణాల వల్ల పర్యవేక్షణ కరువైందని, అందుకే పన్ను బకాయిలు పెరిగిపోయాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 31) కావడంతో, నగరవ్యాప్తంగా భారీగా బకాయిలు ఉన్న ఆస్తులపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రముఖుల ఇళ్లు అని చూడకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు