
తిరుమల, 31 మార్చి (హి.స.) తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామివారి ఉచితదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8-10 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనమ్, దివ్యదర్శనమ్ టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (సోమవారం) 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 27,241 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక స్వామివారి హుండీకి నిన్న రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించిన కానుకల విలువ రూ.5.08 కోట్లు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. 2025 జులై 30న స్వామివారి హుండీ ఆదాయం రూ.5.44 కోట్లు రాగా.. ఏడాదిలోపు రెండోసారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు దాటింది.
తిరుమలలో రేపటి వరకూ శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. బుధవారం వసంత మండపానికి ఉత్సవమూర్తులు మలయప్పస్వామి, ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV