
న్యూఢిల్లీ, 06 మార్చి (హి.స.)
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య
యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్త చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన (Stranded at Sea) రష్యా (Russia) చమురును కొనుగోలు చేసేందుకు భారత్ (India)కు అమెరికా 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు (Waiver) మంజూరు చేసింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ప్రవాహం ఆగకుండా చూసేందుకు అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాల్లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని నివారించేందుకు ఇప్పటికే రష్యా నుంచి బయలుదేరి సముద్రంలో నిలిచిపోయిన సుమారు 95 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.
కాగా, గతంలో రష్యా చమురు కొనుగోళ్లపై భారత్పై ఒత్తిడి తెచ్చిన ట్రంప్ యంత్రాంగం.. ప్రస్తుత మిడిల్ ఈస్ట్ (Middle East) యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఈ చర్యను చేపట్టింది. అయితే, భారత్ తన చమురు అవసరాల్లో 40 శాతం మిడిల్ ఈస్ట్ నుంచే పొందుతుంది. ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుండటంతో దేశీయంగా ఇంధన ధరలు పెరగకుండా రష్యా చమురు భారత్కు పెద్ద ప్లస్ కానుంది. మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా తిరిగి ప్రారంభం అయ్యే వరకు భారత్ అమెరికా నుంచి మరిన్ని చమురు కొనుగోళ్లు జరుపుతుందని అమెరికా ఆశిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు