
అస్సాం, 01 ఏప్రిల్ (హి.స.)
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో
భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) బుధవారం ఉదయం దిబ్రుఘర్ జిల్లాలోని ఒక తేయాకు తోటను సందర్శించి అక్కడి మహిళా కార్మికులతో ముచ్చటించారు. తేయాకు అస్సాం యొక్క ఆత్మ అని అభివర్ణించిన ప్రధాని, కార్మికులతో కలిసి స్వయంగా ఆకులు కోయడమే కాకుండా వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో ఈ కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారితో గడిపిన సమయం తనకు చిరస్మరణీయమైన అనుభూతిని ఇచ్చిందని భావోద్వేగంగా పేర్కొన్నారు.
రాజకీయంగానూ ప్రాధాన్యత కలిగిన ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ధే మాజీ, బిశ్వనాథ్ జిల్లాలో జరగనున్న భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఏప్రిల్ 9న జరగనున్న 126 అసెంబ్లీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో, గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో శాంతిని నెలకొల్పిందని, తేయాకు కార్మికుల సంక్షేమం కోసం భూమి పట్టాల పంపిణీ వంటి అనేక చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రధాని పర్యటనతో అస్సాం ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు