
కలకత్తా, 14 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలపడటానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణమని, ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేసే (యూజ్ అండ్ త్రో) విధానాన్ని ఆమె అనుసరిస్తారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్న ఒవైసీ, ఆ మరక తమకు కాదని, మమతాకే అంటుతుందని స్పష్టం చేశారు.
బెంగాల్లో బీజేపీని బలోపేతం చేసింది మమతా బెనర్జీనే. 1998, 1999లలో బీజేపీ పార్లమెంటులో తొలిసారి గెలవడానికి తృణమూల్ కాంగ్రెస్ సహకరించలేదా? ఆ తర్వాత మీరు రైల్వే మంత్రి అయ్యారు. గుజరాత్ అల్లర్లపై దేశమంతా వేలెత్తి చూపుతున్నప్పుడు కూడా మీరు ఎన్డీయే కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. అలాంటి మీరు ఇప్పుడు నాపై వేలెత్తి చూపుతారా? అని ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింలను ఓట్లు వేసే పశువుల్లా చూస్తున్నారని, వారి కోసం మమత చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు.
ఇటీవల తృణమూల్ రెబల్ నేత హుమయూన్ కబీర్తో పొత్తు పెట్టుకోవడంపైనా ఒవైసీ స్పందించారు. బీజేపీ నేతలతో సంబంధాల గురించి హుమయూన్ మాట్లాడినట్టుగా ఉన్న ఒక 'స్టింగ్ వీడియో' బయటకు రావడంతో ఆయనతో పొత్తును రద్దు చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు హుమయూన్ తాను తృణమూల్తోనే ఉన్నానని చెబుతున్నారని, తన పరిస్థితిని లైలా కోసం ఎదురుచూసే వ్యక్తిలా మార్చారని ఒవైసీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi