
కర్ణాటక, 17 ఏప్రిల్ (హి.స.)
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో పెన విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం సురపుర తాలూకా దేవాపూర్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యాదగిరి నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న కారు, బెంగళూరు నుంచి కలబురగి వైపు వస్తున్న ప్రైవేట్ బస్సును దేవాపూర్ సమీపంలో ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు ఇంజిన్లో మంటలు అంటుకొని సెకన్ల వ్యవధిలోనే వాహనం మొత్తం వ్యాపించాయి. లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వీరంతా సిర్వార్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో చిక్కుకున్న మరో ఇద్దరిని స్థానికులు ధైర్యంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైంది. సురపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు