
హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)
పార్లమెంట్లో మహిళా బిల్లుల విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నేడు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 రణరంగంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా ముఖ్యమంత్రి ఇంటి వైపు దూసుకెళ్లారు. వీరి రాకపై ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. మహిళా నేతలు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది.
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించిన మహిళా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. శిల్పారెడ్డి సహా పలువురు ముఖ్య నేతలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నారీశక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ నశించాలి అంటూ మహిళా మోర్చా నేతలు చేసిన నినాదాలతో జూబ్లీహిల్స్ మార్మోగింది. అరెస్ట్ సమయంలో శిల్పారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుపుతుంటే పోలీసులతో అణచివేయాలని చూడటం హేయమైన చర్య అని విమర్శించారు. మహిళలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ ముట్టడి యత్నం నేపథ్యంలో నిరసన జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు