
Telangana, 02 ఏప్రిల్ (హి.స.)
పవిత్ర
గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఇఫ్తార్ విందు నిర్వహించి, చికెన్ బిర్యానీ తిన్న తర్వాత వాటి ఎముకలను, ఇతర వ్యర్థాలను నదిలో పడేసిన కేసులో అరెస్టయిన 14 మంది నిందితులకు వారణాసి కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ
తగిలింది. నిందితులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులను జిల్లా మరియు
సెషన్స్ జడ్జి అలోక్ కుమార్ తిరస్కరించారు.
అసలేం జరిగింది?:
గత మార్చి 15న కొందరు ముస్లిం
యువకులు గంగా నదిలో ఒక పడవను అద్దెకు తీసుకుని ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు. ఈ
క్రమంలో వారు పడవపైనే చికెన్ బిర్యానీ తింటూ, తిన్న తర్వాత
మిగిలిన ఎముకలను మరియు ఆహార వ్యర్థాలను పవిత్ర గంగా నదిలో పడేస్తున్న వీడియో
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సనాతన ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే గంగా
నదిలో ఇలా మాంసాహారం తిని వ్యర్థాలు పడేయడం హిందూ సమాజం యొక్క మనోభావాలను తీవ్రంగా
గాయపరిచింది.
దీనిపై భారతీయ
జనతా యువ మోర్చా (BJYM) నగర అధ్యక్షుడు రజత్ జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు
చేశారు. దాంతో పోలీసులు మార్చి 17న 14 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
కోర్టు ఏమన్నదంటే?:
గతంలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించగా, నిందితులు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ
సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఈ దారుణమైన చర్యను వీడియో
తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటే.. సమాజంలో మత సామరస్యాన్ని
దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వక చర్యగా ప్రాథమికంగా అర్థమవుతోందని జడ్జి పేర్కొన్నారు.
మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి, వాటిని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం నేరం యొక్క
తీవ్రతను మరింత పెంచుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi