
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)
ఇస్నాపూర్ ప్రాంతంలో నివసించే ఓ బట్టల వ్యాపారి రోజువారీలా తన వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనం పై బయలుదేరాడు. అయితే వెనుక నుంచి మృత్యు రూపంలో వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్ అతనిపైకి దూసుకురావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఇస్నాపూర్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇస్నాపూర్ పరిధిలోని తేజ కాలనీకి చెందిన బట్టల వ్యాపారి ఎ.సత్యనారాయణ (60) తన స్కూటీ పై రోజువారీలా బట్టలతో ఇస్నాపూర్ నుంచి పటాన్చేరు వైపు వెళ్తుండగా, ఇస్నాపూర్ ఎక్స్రేడ్ వద్దకు రాగానే ఓ వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..