
అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)
: ఏపీలో పదోతరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 87.90 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులుకాగా.. 82.68శాతం మంది బాలురు పాసయ్యారు. బాలురితో పోలిస్తే 5.22 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 78.39శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2,161 పాఠశాలల్లో వందశాతం, 16 పాఠశాలల్లో సున్నాశాతం ఉత్తీర్ణత నమోదైంది.
96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానం నిలవగా.. 57.12 శాతంతో అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈసారి అత్యధికంగా 96.04శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమస్థానంలో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి. మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ మే 1 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది.
ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఫెయిలైన వారు నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సబ్జెక్ట్ - మీడియం వారీగా ఫలితాలు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ