
ఆదిలాబాద్, 16 మే (హి.స.)
ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం సైకిల్ పై ప్రయాణించి నగరంలోని వార్డులను సందర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థిరత్వం కోసం పెట్రోల్, డీజిల్ వంటి దిగుమతి ఇంధనాలను సాధ్యమైనంత వరకు ఆదా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్ల వినియోగాన్ని తగ్గించి సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ వార్డు కౌన్సిలర్లు కూడా కాలనీల్లో సైకిల్పై తిరగాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పై ప్రజల్లో చర్చ జరగాలని, ప్రధాని మోడీ ఆలోచనలను ప్రజలకు అర్థమయ్యేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల పై ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు