అక్రమ వలసదారులే లక్ష్యం.. ఉన్నత స్థాయి కమిటీని వేసిన కేంద్రం
అక్రమ వలసదారులే లక్ష్యం.. ఉన్నత స్థాయి కమిటీని వేసిన కేంద్రం
Amithsha


ఢిల్లీ 27 మే (హి.స.)

దేశవ్యాప్తంగా అక్రమ వలసలు, చొరబాట్ల కారణంగా జనాభా నిష్పత్తిలో వస్తున్న మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులను నిశితంగా పరిశీలించి, పరిష్కారాలు సూచించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెను సవాల్గా మారాయని కేంద్రం పేర్కొంది.

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. చట్టవిరుద్ధ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు దేశ భద్రతకు, గిరిజనుల ఉనికికి ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం దాటించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించే పూర్తి బాధ్యత బీఎస్ఎఫ్పై ఉందని గుర్తుచేశారు.

ఈ కమిటీలో జస్టిస్ నావ్లేకర్తో పాటు దేశ జనగణన కమిషనర్, మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త శామికా రవి సభ్యులుగా ఉంటారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల జరుగుతున్న మార్పులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. మత, సామాజిక వర్గాల స్థాయిలో జనాభా నిష్పత్తిలో వస్తున్న మార్పులను విశ్లేషించి, కాలపరిమితితో కూడిన పరిష్కారాన్ని సూచిస్తుంది అని అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న డేటాను అధ్యయనం చేసి, సంబంధిత వర్గాలతో సంప్రదించి ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande