
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
నగర పరిధిలోని ఐటీ కారిడార్లో డ్రగ్స్,
గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ ఫోర్స్ (Eagle Force) ఇవాళ ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ అయిన నానక్ రామ్ గూడా (Nanakramguda) పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న గంజాయి నెట్వర్ను టార్గెట్ చేస్తూ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో కిరాణా షాప్ ముసుగులో సాగుతున్న రూ.కోట్ల గంజాయి దందా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నానక్రామ్గూడ ఐటీ కోర్ ఏరియాలో నివాసం ఉండే ప్రముఖ డ్రగ్స్ వ్యాపారి నీతూ భాయ్(Neetu Bhai) కిరాణం దుకాణం నడుపుతున్నాడు. అయితే, ఈ షాప్ ముసుగులో అతను పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ నిఘా విభాగం పక్కా సమాచారం సేకరించింది. కేవలం గంజాయి అమ్మకాల ద్వారానే నీతూ భాయ్ రోజుకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్లోని లండన్, యూఎస్ క్లయింట్లతో పనిచేసే నైట్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. గంజాయి కోసం నిత్యం ఐటీ ఉద్యోగులు ఇతని ఇంటి ముందు క్యూ కడుతుంటారు.
పక్కా స్కెచ్తో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్.. నీతూ భాయ్ నివాసం, కిరాణా షాప్ను ఒకేసారి రౌండప్ చేసింది. కేవలం గంట వ్యవధిలోనే అక్కడ గంజాయి కొనుగోలు చేస్తూ, సేవిస్తూ ఉన్న సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులకు (Software Engineers) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన వారంతా గచ్చిబౌలి, మాదాపూర్, నానక్గామూడ పరిసరాల్లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, గతంలోనే నీతూ భాయ్ అక్రమ దందాలపై నిఘా పెట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేశారు. అయితే, ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన నీతూ భాయ్ మళ్లీ యథావిధిగా గంజాయి దందా షురూ చేశాడు. తాజాగా ఈగల్ ఫోర్స్ దాడులు చేస్తుందనే ముందస్తు సమాచారం లీక్ కావడంతో డ్రగ్ డాన్ నీతూ భాయ్ అక్కడి నుంచి తృటిలో తప్పించుకుని పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఐటీ కారిడార్లో డ్రగ్స్ సరఫరా చేసే ఇలాంటి నెట్వర్క్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..