
తిరుమల, 28 జూన్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా మూడురోజులు సెలవులు కావడంతో.. శుక్రవారం నుంచీ తిరుమలకొండకు భక్తుల రాక పెరిగింది. ఆదివారానికి రద్దీ మరింత ఎక్కువైంది. ఉదయం 7 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. నారాయణగిరి షెడ్లు సైతం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం బాటగంగమ్మ గుడివరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో స్వామివారి దర్శనానికి ఎక్కువసమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే వారికి సర్వదర్శనానికి 24-30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 5-7 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 4-6 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న (శనివారం) స్వామివారిని 85,582 మంది భక్తులు దర్శించుకోగా.. 44,155 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు సమకూరింది. 4.66 లక్షల లడ్డూలను విక్రయించారు. 3.43 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV