
అమరావతి, 01 జూలై (హి.స.)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అంతా కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. పేదవారి కళ్లల్లో ఆనందం చూడాలనే ముఖ్యమంత్రి పెన్షన్ పెంచారని చెప్పారు.
ఏపీలో ప్రతి సంవత్సరం రూ.32 వేల కోట్లు పెన్షన్గా ఇస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. ప్రతినెలా ఈ పెన్షన్ల కార్యక్రమం ఒకటో తేదీన తెల్లవారుజామున 6 గంటలకు మొదలుపెట్టి 8:30 నుంచి 9 గంటలకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ హర్షధ్వానాలతో ఆమోదిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ