
హైదరాబాద్, 26 జూలై (హి.స.)విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో బాధ్యతారాహిత్యానికి ఏమాత్రం తావులేదని మరోసారి స్పష్టం చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక విధుల్లో లోపాలు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఈ నిర్ణయంతో మరోసారి స్పష్టమైంది.
బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదు: సీపీ సజ్జనార్
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ పోలీసు అధికారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం లేదా బాధ్యతారాహిత్యం ప్రదర్శించిన వారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేందుకు క్రమశిక్షణ అత్యంత కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్