
అమరావతి, 03 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదంతో నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడి నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
ఈ ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది మే 4న జరిగిన సమావేశంలో ఆమోదించింది. అనంతరం నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది.
హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ముందుగా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్లను ప్రతిపాదిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్రానికి పంపిస్తుంది. అనంతరం కేంద్రం పరిశీలించి ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం తీసుకుంటుంది. అన్ని దశలు పూర్తైన తర్వాత రాష్ట్రపతి నియామక ఉత్తర్వులపై సంతకం చేస్తారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi