
మార్కాపూర్, 30 జూలై (హి.స.) : మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో పొగాకు రైతులు, రైతు సంఘం నాయకులు ఈ రోజు గురువారం భారీ ఆందోళనకు దిగారు.
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం–ఎర్రగొండపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రభుత్వం పొగాకు రైతులను బిక్షగాళ్లలా చూస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రూ.1000 కోట్లు కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు మా పోరాటం ఆగదు, పొగాకు రైతులకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేస్తూ రహదారిపై నిరసన కొనసాగించారు. రైతుల ఆందోళనతో గంటకుపైగా మార్కాపురం–ఎర్రగొండపాలెం హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV