
తిరుమల, 04 జూలై (హి.స.) వయసు శరీరానికే కానీ అచంచలమైన భక్తికి కాదని కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు నిరూపించారు. సాక్షాత్తూ ఆ కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవాలనే ప్రగాఢమైన పట్టుదలతో, ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో తిరుమల మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్లి కొండనెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె అపారమైన మనోబలాన్ని చూసి సోషల్ మీడియాలో ‘ఇదంతా ఆ శ్రీవారి మహిమే’ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గుండెల్లో గట్టి నమ్మకం, బలమైన సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఏదైనా సాధించవచ్చని ఈ అద్భుత ఘట్టం స్పష్టం చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV