
కుప్పం, 04 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ముఖ్యమంత్రిని చూసేందుకు, తమ సమస్యలను విన్నవించుకునేందుకు స్థానికులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
ప్రజల వద్దకు వెళ్లిన సీఎం, వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు స్థానికులు తమ వ్యక్తిగత, నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేయగా.. వాటిని స్వీకరించిన చంద్రబాబు, అర్జీలపై తక్షణమే స్పందించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నలగంపల్లె గ్రామాన్ని సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ గ్రామంలో వినూత్నంగా రూపొందించిన ‘నెట్ జీరో’ (Net Zero) ఇళ్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. పర్యావరణహితంగా మారిన ఈ ఇళ్లలోని ఆధునిక వసతులను సీఎం క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV