
రాజమండ్రి,14 ఆగస్టు (హి.స.)
:ఏపీలో ప్రతి రోజూ 7000 టన్నుల చెత్త వస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) రాజమండ్రి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని మండిపడ్డారు. చెత్త పన్ను వేసినా లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్లిపోయిందన్నారు. మున్సిపాలిటీల్లో మిగిలిన మొత్తం 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 2014-19 లో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. గత ముఖ్యమంత్రికి అవగాహన లేక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను రద్దు చేశారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక.. కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తి కాగానే రాజమహేంద్రవరంలో వచ్చే చెత్తను అక్కడికి తరలిస్తామన్నారు. ఈలోగా వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ప్లాంట్లు పూర్తి చేసి ఘన వ్యర్థాల నిర్వహణ చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సీఎం చెప్పారని, విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు రాగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ