గచ్చిబౌలిలో కూలిన భవనం.. ఇద్దరి దుర్మరణం
గచ్చిబౌలిలో కూలిన భవనం.. ఇద్దరి దుర్మరణం
గచ్చిబౌలిలో కూలిన భవనం.. ఇద్దరి దుర్మరణం


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్‌లో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోపత్, ఉమేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

'విక్టిమ్ లొకేషన్ సిస్టమ్' సహాయంతో శిథిలాల నుంచి రెండు మృతదేహాలను వెలికితీసి పోలీసులకు అప్పగించినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి సుధాకర్ రావు తెలిపారు. ప్రమాద సమయంలో భవనంలోకి ఇద్దరు కార్మికులు వెళ్లారని స్థానికులు చెప్పడంతో, శిథిలాల కింద మరెవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, భవన యజమాని ఖాజా క్షేత్రస్థాయి అధికారులకు ముడుపులు చెల్లించి పనులు కొనసాగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande