
కడప, 19 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో రైతులు పంట చేతికి వచ్చిన ప్రతీ సారి ఇబ్బంది పడుతున్నారు. మొదట తోతాపురి మామిడి కాయలకు డిమాండ్ లేక ఆందోళన చెందారు. తర్వాత ఉల్లి పంట పరిస్థితి అదే. ఇప్పుడు అరటి పంటలకూ డిమాండ్ ఉండటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో తోతాపురి మామిడి రైతులు ధరలు పడిపోవడంతో రూ.1,000 కోట్ల నష్టం చవిచూశారు. సెప్టెంబర్లో ఉల్లి ధరలు పడిపోయి, కర్నూల్, కడప జిల్లాల్లో రైతులు పంటను పారబోశారు. ఇప్పుడు అరటి పంటలకూ అదే పరిస్థితి వచ్చింది.
మార్కెట్లో డిమాండున్నా అరటి ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎక్కువగా పండించే గ్రాండ్-9 (పచ్చ అరటి) రెండు నెలల క్రితం కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు పలికింది. ధరలు తగ్గుతూ వచ్చి ప్రస్తుతం కిలో రూ. 7 నుంచి 5రూపాయలకు రైతుల నుంచి వ్యాపారులు తీసుకుంటున్నారు.ధరలు బాగుంటాయని పచ్చ అరటిని సాగు చేస్తే మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చాలా తోటల్లో అరటి గెలలు పక్వదశకు చేరుకోవడంతో ధరలు లేకున్నా రైతులు వచ్చినంతవరకు తీసుకుని కోతలు చేస్తున్నారు.
అధిక పెట్టుబడితో సాగుచేసిన అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా చూపి అరటి ధరలు తగ్గించారని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతుల పంటను కొనుగోలు చేయడంతోపాటు, లాభసాటి ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే కోత దశకు వచ్చిన అరటిని ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV