రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొడంగల్లో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Revanth reddy


హైదరాబాద్, 05 సెప్టెంబర్ (హి.స.) కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొడంగల్లో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పిల్లల భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని సర్వేపల్లి చెప్పేవారని తెలిపారు. గురువు గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.

పిల్లల ఎదుగుదల, భవిష్యత్కు పునాది వేసేది టీచర్లే అని.. పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే అని సీఎం చెప్పుకొచ్చారు. విద్యారంగంలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు.

టీచర్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ పెరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 95శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు.

గతంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో జాప్యం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. తాను వచ్చాక టీచర్లు అడగకపోయినా ప్రమోషన్లు ఇచ్చినట్లు చెప్పారు. 317 జీవోతో బదిలీల సమస్యలను పరిష్కరించామని.. కేకే కమిటీ ద్వారా సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన వచ్చాక 55 రోజుల్లోనే 10 వేల టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు.

‘వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తిచేసుకున్నాం.1000 రోజుల్లో నేను ఒక్క రోజైనా సెలవు తీసుకోలేదు.. ఇంకొకాయన వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. రెండేళ్ల సమయం ఇస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. 2028 డిసెంబర్ లేదా 2029 మార్చిలో ఎన్నికలు రావొచ్చు. ఆ రోజు పరీక్ష రాయడానికి మళ్లీ మీ దగ్గరికే వస్తా. సమస్యలు పరిష్కరించకపోతే.. నేను రాసే ఎన్నికల పరీక్షకు మీరే మార్కులు వేయండి. టీచర్లు రాజకీయ నాయకుల ట్రాప్లో పడొద్దు. విద్యార్థులు అమాయకంగా మోసపోవద్దు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని అడ్డంపెట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. కేకే కమిటీతో చర్చించి మాకు సూచనలు ఇవ్వండి’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande