విశాఖపట్నం, 13 అక్టోబర్ (హి.స.)
ఐటీ రంగంలో హైదరాబాద్కు దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి 30ఏళ్లు పడితే విశాఖను పదేళ్లలోనే ఆ స్థాయికి తీసుకెళతామని ప్రకటించారు. విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నం.3లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్కు ఏపీఐఐసీ కేటాయించిన 3.6 ఎకరాల స్థలంలో ఆదివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం రుషికొండ ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో సిఫీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని లోకేశ్ జ్యోతి వెలిగించి ప్రారంభించి, ప్రసంగించారు. గత 17 నెలల్లో రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా అందులో 50శాతానికి పైగా విశాఖ జిల్లాకే వచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు భారీగా రావడం ఇదే మొదటిసారని, ఇదంతా ఒక్కరోజులో సాధ్యం కాలేదని చెప్పారు. సుదీర్ఘ చర్చలు, అనేకమంది కీలకంగా వ్యవహరించడం వల్లనే వచ్చాయన్నారు. సిఫీ సంస్థను ఏపీకి రప్పించడానికి ఎనిమిదేళ్లు పట్టిందన్నారు. రాష్ట్రానికి విశాఖపట్నమే ఆర్థిక రాజధాని అని, అభివృద్ధి విషయంలో వికేంద్రీకృత విధానం అనుసరిస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ