
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూడా వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. నెల్లూరు నగరంలో రోడ్లపై నీరు ప్రవహిస్తుండగా, ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ నీటిని బయటకు పంపుతున్నారు. ఈ జిల్లాలోని 957.4 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. గురువారం కూడా జిల్లాలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని 15 మండలాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శ్రీకాళహస్తిలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
జిల్లాలో స్వర్ణముఖి, కైవల్య, అరుణా నదులతోపాటు వాగులు, జలపాతాలూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏర్పేడు మండలం జంగాలపల్లి చెరువుకు గండి పడింది. రోడ్డు కొట్టుకుపోవడం, బ్రిడి ్జలు, కాజ్వేలపైకి నీరు చేరడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి జిల్లావ్యాప్తంగా 19 మార్గాల్లో 44 ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. భారీ వర్షాలతో పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటించారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శేషాచలం కొండల నుంచీ వచ్చే కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణవనం మండలం కైలాసనాధ కోన వద్ద జలపాతం, పుత్తూరు మండలం మూలకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ