
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను (Investments) ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. మొదటి రోజు వన్ టూ వన్ 5 సమావేశాలను నిర్వహించారు. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. రెండో రోజైన నేడు అబుదాబీ (Abudabi) పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. దుబాయ్ నుంచి అబుదాబీ వెళ్ళి అక్కడ అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో భేటీ అవుతారు. అనంతరం జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతోనూ, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులతో ముఖ్యమంత్రి (Chief Ministe) సమావేశంలో పాల్గొంటారు.
ఆ తరువాత అబుదాబీలో స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో, అనంతరం లులూ గ్రూప్ (Lulu Group) సీఎండీ యూసఫ్ అలీతోనూ సమావేశమై విశాఖ, విజయవాడలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చిస్తారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతోనూ సీఎం భేటీ కానున్నారు. అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో, అనంతరం యాస్ ఐ ల్యాండ్ లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ ఆయన చర్చిస్తారు. ఈ భేటీ అనంతరం భారత కాన్సుల్ జనరల్ (Indian Consule General) నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV