
తిరుమల, 27 అక్టోబర్ (హి.స.)టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 31వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమం అక్టోబరు 30 నుంచి నవంబరు 1వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 31న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. అంతకు ముందు రోజైన అక్టోబరు 30న తిరుమల ఆస్థాన మండపంలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్టోబరు 31న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయి. నవంబరు 1న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుంచి స్వామిజీలు ధార్మిక సందేశము ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV