
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధిత ఏజెన్సీ బాధ్యత వహించేలా చూడాలని, వీటి రిపేర్ల కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ నీటిపారుదల శాఖపై వారు సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్జ్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పంపిన లేఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు వివరించిన రేవంత్ రెడ్డి వాటిపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టువారీగా విశ్లేషణలు చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని డ్యామ్లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..