
కరీంనగర్, 28 అక్టోబర్ (హి.స.)
గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే, బాధ్యులైన ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయాలని, ఘటనకు కారణమైన అటెండర్ యాకుబ్ పాషాను విధుల నుండి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ మెమోలు జారీ చేసి, వారిని బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు