
దిల్లీ: 28 అక్టోబర్ (హి.స.)భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు చేపడతారు. 23వ తేదీన ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు.ప్రస్తుతం సీనియారిటీలో తన తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ను తదుపరి సీజేఐగా నియమించాలని సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ గవాయ్ లేఖ పంపారు. దాని ప్రతిని సోమవారమే జస్టిస్ సూర్యకాంత్కు అందజేశారు. ‘సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సిఫార్సు చేశారు’ అని సుప్రీం కోర్టు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. -
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ