
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలోని ఏడు తీర ప్రాంత జిల్లాలపై మొంథా తుఫాన్ పంజావిసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అప్పటికప్పుడు కుంభవృష్టి పడటం, ఆ తర్వాత పెనుగాలులు విరుచుకుపడడం, మళ్లీ కాసేపటికి ఒక్కసారిగా తీవ్రంగా ఎండ కాయడం.. ఇలా గంటకో రకంగా వాతావరణం మారిపోతూ జనాన్ని హడలెత్తించింది. గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయ తాండవం చేసింది. భారీ శబ్దాలతో 10 మీటర్లకు పైగా ఎత్తులో కెరటాలు ఎగసిపడటంతో కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో 10 కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది. కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం నుంచి రహదారులపై రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండడంతో కాకినాడ పోర్టులో పదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వేలాది చెట్లు నేలకొరగడంతో రాత్రి 7గంటల వరకు సాధ్యమైనన్ని తొలగించి వైద్యుత్ లైన్లు సరిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ