
తిరుమల, 29 అక్టోబర్ (హి.స.)
శేషాచలం అడవులు మరో అరుదైన జీవికి నిలయంగా నిలిచాయి. తిరుమల కొండల్లోని దట్టమైన చందనపు అడవిలో శాస్త్రవేత్తలు సరికొత్త బల్లి జాతిని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఈ జీవిని గుర్తించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ దీనికి ‘వెంకటాద్రి స్లెండర్ గెక్కో’ అని పేరు పెట్టారు.
ఈ కొత్త బల్లి జాతి పలుచగా, తొండను పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. చందనపు చెట్టు బెరడు కింద నివసిస్తున్న సమయంలో దీనిని గుర్తించినట్లు వారు వివరించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘హెర్పటోజోవా’లో ప్రచురించారు.
ఈ కీలక పరిశోధనలో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫ్రెష్వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్, కోల్కతాలోని రెప్లిల్లా విభాగం, ఒడిసాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. శేషాచలం అడవుల జీవవైవిధ్యానికి ఈ కొత్త ఆవిష్కరణ మరో నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV