తెలంగాణ, జగిత్యాల. 4 అక్టోబర్ (హి.స.)
లండన్లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల కిందట లండన్ వెళ్లాడు. అక్కడే పీజీ పూర్తి చేసిన మహేందర్ రెడ్డికి ఉద్యోగం కూడా వచ్చింది. వర్క్ వీసా కూడా రావడంతో తమ కొడుకు సెటిల్ అయిపోయాడని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే పెను విషాదం వారిని ముంచేసింది. అక్టోబర్ 3వ తేదీ రాత్రి గుండెపోటుతో మహేందర్ రెడ్డి మరణించాడు.
ఈ విషయాన్ని అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి మహేందర్ రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషించేలోపే ఇలా మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మహేందర్ రెడ్డి తండ్రి రమేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షునిగా ఉన్నారు. మహేందర్ మృతి పట్ల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంతాపం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు