పట్నా/ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.) ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్)తో బిహార్లో ఓటర్ల జాబితా ‘శుద్ధీకరణ’ జరిగిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఉద్ఘాటించారు. 22 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ప్రక్షాళన చోటుచేసుకుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు బిహార్లో రెండు రోజులపాటు పర్యటించిన జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషిలతో కలిసి పట్నాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబరు 22తో ముగియనున్న నేపథ్యంలో.. ఆ లోపే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని సీఈసీ చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని, తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక 15 రోజుల్లోపే ఎపిక్ కార్డులు అందేలా చూడటం, పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ డిపాజిట్ సదుపాయం కల్పించడం, ఈవీఎండేటా సరిపోలడం లేదంటూ ఫిర్యాదులు వచ్చినప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా వెరిఫై చేయడం, ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ