ముంబై,07,అక్టోబర్ (హి.స.) రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖలో పలు మార్పులు చేసింది. అయితే.. ఈ ఏడాది జులై 1 నుంచి పలు సంస్కరణలకు నాంది పలకగా.. తాజాగా ఈ నెల 1 నుంచి మరిన్ని నిబంధనలు అమలులోకి తెచ్చింది. దీనిలో భాగంగా ఐఆర్సీటీసీ యాప్ / వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేందుకు.. ఐఆర్సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నెంబరుతో ఆధార్ కార్డు లింక్ అయ్యేలా కార్యాచరణ రూపొందించింది.
గతంలో ఐఆర్సీటీసీ అకౌంట్ ఉంటే.. టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ.. దుర్వినియోగానికి పాల్పడేవారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నెంబరుతో ఆధార్ కార్డు అనుసంధానమైతేనే టికెట్ బుక్ చేసుకునేలా మార్చింది.
అలాగే.. ప్రయాణానికి ముందు రోజు అందుబాటులోకి వచ్చే తక్కువ సంఖ్యలో రిజర్వ్ చేసిన సీట్లపై కూడా నిబంధనలు విధించింది. ఈ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల నుంచి రిజర్వేషన్ చేసుకునేలా మార్పులు చేసింది. తాజాగా ఈ నెల 1 నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఇదే విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీకి ఉన్న ఫోన్ నెంబరుతో ఆధార్ లింకప్ చేసుకుని ఉన్న ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు తీసుకునేలా... లింకప్ కానీ వారు ఉదయం 8.15 గంటల నుంచి తీసుకునేలా మార్పులు చేసినట్లు వివరించింది. ఈ మార్పుల ద్వారా టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రయాణికులకు మేలు కలుగుతోందని రైల్వే శాఖ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు