
అమరావతి, 10 నవంబర్ (హి.స.)
: బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి (23) అనే విద్యార్థిని అనారోగ్యం కారణంగా ఇటీవల అమెరికాలో మృతిచెందిన విషయం I తెలిసిందే. ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నందువల్ల రాజ్యలక్ష్మి మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి యూఎస్లోని భారత కమ్యూనిటీ నిధులు సేకరిస్తున్నట్లు మృతురాలి బంధువు చైతన్య పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చులకు, విద్యా రుణాలను తిరిగి చెల్లించడానికి, రాజ్యలక్ష్మి తల్లిదండ్రులకు కొంతమేర ఆర్థిక సహాయం అందించడానికి గోఫండ్మీ సంస్థ సాయంతో భారత కమ్యూనిటీ నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్లో గల యూనివర్సిటీ ఆఫ్ న్యూహెవన్లో ఎంఎస్ కంప్యూటర్స్ విభాగంలో 2023లో చేరారు. ఇటీవల విద్యాభ్యాసం ముగియడంతో అక్కడే స్నేహితులతో కలిసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. కొద్ది రోజులుగా జలుబు, ఆయాసంగా ఉందని, చికిత్స కోసం ఈనెల 9న వైద్యుల అపాయింట్మెంట్ తీసుకున్నానని 6వ తేదీ రాత్రి ఆమె ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలిపింది. అదే రోజు రాత్రి స్నేహితులతో కలిసి నిద్రపోయిన రాజ్యలక్ష్మిని ఉదయం అల్పాహారానికి స్నేహితులు లేపగా కదలికలు లేకపోవడంతో వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తించడానికి అమెరికాలో శవపరీక్షలు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆమె మృతదేహాన్ని భారత్కు తరలించడానికి అమెరికాలోని భారత కమ్యూనిటీ ప్రయత్నిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ