
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.) ప్రత్యేక లోక్ అదాలత్లో హైదరాబాద్ కమిషనరేట్ అత్యధికంగా 11,226 కేసులు పరిష్కరించి అన్ని కమిషనరేట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్(సీసీపీఎస్), హైదరాబాద్ నగర జోనల్ సైబర్ సెల్స్ కలిసి 709 కేసులు పరిష్కరించి రూ.5,77,78,601.23 రీఫండ్ డబ్బును బాధితులకు అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు అదనపు పోలీసు కమిషనర్(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు తెలిపారు.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో సీసీపీఎస్ 40 కేసులను కంపౌండ్/కాంప్రమైజ్ చేసి, బాధితులకు రూ.1.98,04,148 మొత్తాన్ని, లోక్ అదాలత్కు ముందు సైబర్ పోలీసులు మరో 275 కేసుల్లో రూ.3,07,91,283, జోనల్ సైబర్ సెల్స్ 394 కేసుల్లో రూ.71,83,170 విజయవంతంగా రీఫండ్ చేసినట్లు వివరించారు. డీసీపీ (సైబర్ క్రైమ్స్), హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జోనల్ డీసీపీల నిరంతర పర్యవేక్షణ, సమర్థ మార్గదర్శనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పోలీసు శాఖ హైదరాబాద్ కమిషనరేట్ భవిష్యత్తులో సైబర్ నేరాల దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా త్వరితగతిన న్యాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ