
అమరావతి, 19 నవంబర్ (హి.స.) అమరావతి రైతుల (Amaravathi Farmers) సమస్యలకు సానుకూల దృక్పథంతో పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు (CRDA Commissioner Kanna Babu) హామీనిచ్చారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అర్బన్ డిజైన్ అర్కిటెక్చరల్ మార్గదర్శకాలపై రైతు ప్రతినిధులకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అవగాహన సమావేశం (Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతో రాజధానిని అభివృద్ధి చేయాలని కోరారు. సీఆర్డీఏ యంత్రాంగం జవాబుదారీతనంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న కొన్ని విషయాలపై అభ్యంతరాలతో పాటు వివిధ సమస్యలపై భూములిచ్చిన రైతులు సీఆర్డీఏ ముందు గట్టిగా వాదనలు వినిపించారు.
సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ రైతులతో ప్రతి నెలా మూడో శనివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. తద్వారా సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. సీఆర్డీఏ అధికారులకు, రైతులకు మధ్య సమాచారం లోపం ఉందని గుర్తించామన్నారు. ఆ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. రైతులు తెలిపిన గ్రామ కంఠాలు, జరీబు భూములు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV