
కాకినాడ, 19 డిసెంబర్ (హి.స.)
: డిజిటల్ అరెస్ట్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన సూరంపూడి చంద్రశేఖర్, ఇమంది వెంకట్ నవీన్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరి కొందరు నిందితుల కోసం కోసం గాలిస్తున్నారు.
ఇటీవల కాకినాడకు చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్ కాల్ చేసిన సైబర్ ముఠా.. డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి రూ.59లక్షలు వసూలు చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్న నిందితులు.. ఆ తర్వాత షెల్ కంపెనీ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చారు. బైనాన్స్ P2P ద్వారా వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 65 సైబర్ కేసుల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరుకు వీరు.. సైబర్ మోసాల ద్వారా రూ.8 కోట్లు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు, 10 డెబిట్ కార్డులు, చెక్ బుక్స్, పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ