
విశాఖపట్నం, 20 డిసెంబర్ (హి.స.)విశాఖపట్నంలోని హనుమంతువాక జంక్షన్ వద్ద శనివారం ఉదయం తృటిలో భారీ ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఒక ఆటో, ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బస్సును నిలిపివేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు, ఫలితంగా ఆటో బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో ఆటోలో పాఠశాల విద్యార్థులు ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ పిల్లలందరికీ స్వల్ప గాయాలతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV