హైదరాబాద్, 24 మే (హి.స.)
* :: ప్రస్తుత వర్షా కాల
సీజన్ లో ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీనితో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జిల్లాలకు ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తగు మార్గదర్శకాలను విడుదల చేశారు..
గత 2024 ఆగస్టు మాసంలో వచ్చిన భారీ వర్షాలతో సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేరుకోక పోవడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందస్తుగానే ఈసారి 12 స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF ) లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఒక్కో టీమ్ లో తెలంగాణా స్పెషల్ పోలీస్ కు చెందిన 100 సుశిక్షితులైన పోలీసులు ఉంటారని, ఈ బృందాలను రాష్ట్రంలోకి పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేశామని చెప్పారు. తద్వారా, ఎక్కడైనా భారీ వర్షాలు, తుఫానులు వచ్చినా, వెంటనే సమీపంలోని SDRF బృందాలు చేరుకుంటాయని కలెక్టర్లకు తెలిపింది. దీనితో పాటు, ఈ సారి 3 NDRF బృందాలు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చే జిల్లాల్లో ఈసారి ప్రత్యేకంగా అదనపు NDRF బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని NDRF కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని ఫైర్ స్టేషన్లలో ఫైర్ సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నివారణ చర్యలపై శిక్షణను ఇప్పించామని అన్నారు. హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాలకు తక్షణమీ స్పందించేలా హైడ్రా బృందాలను ఏర్పాటు చేసాం. భారీ వర్షాలు, ఆకస్మిక వర్షాలు వస్తే నష్టాలను తగ్గించడానికి పై చర్యలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశముంటే, సంబంధిత జిల్లాలకు కేటాయించిన SDRF , NDRF బృందాలతో టచ్ లో ఉండాలని ఆయా బృందాల వివరాలు సంబంధిత అధికారులకు కూడా ఇవ్వాలని సూచించారు. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల ఫైర్ ఆఫీసర్లతో సంప్రదిస్తూ, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ సేవలను పొందాలని, అత్యవసర పరిస్థితుల్లో NDRF సేవలు కావాలంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖతో టచ్ లో ఉండాలని పేర్కొన్నారు. విపత్తుల నివారణలో సుశిక్షితులైన సింగరేణి కాలరీస్ సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. తమ జిల్లాలోని వరదలు, వర్షాల వల్లముంపు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేయనైనది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు