అమరావతి, 24 మే (హి.స.)
విశాఖపట్నం, మే 24: వరుస బాంబు బెదిరింపు కాల్స్తో ఇటు విజయవాడ అటు విశాఖ నగరాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకుల ఫోన్ కాల్స్తో బాంబు స్క్వాడ్, పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈరోజు (శనివారం) ఉదయం విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని, ఆ తరువాత రైల్వేస్టేషన్కు బాంబు బెదరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించారు. తాజాగా విశాఖ రైల్వేస్టేషన్లోనూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది.
విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తనిఖీలు చేశారు. ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో బాంబు ఉన్నట్లు ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎల్టీటీ చివరి స్టాప్ విశాఖ రైల్వే స్టేషన్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైలు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్ 2 బోగీలో అనుమానిత బ్యాగ్ను గుర్తించారు. ఆ బ్యాగ్ను కూడా సెర్చ్ చేయగా బట్టలు మాత్రమే కనిపించాయి. దీంతో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. ఈ ఆపరేషన్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, సివిల్ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు కలిసి ట్రైన్ను మొత్తాన్ని పరిశీలించారు. ప్రయాణికుల బ్యాగులను కూడా తనిఖీ చేశారు. చివరకు బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. చాలా రష్గా ఉన్న ట్రెయిన్లో ఇలాంటి కాల్ రావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే బ్యాగును మరిచిపోయిన వ్యక్తి యూపీకి చెందిన శ్రీరామ్గా గుర్తించారు. అలాగే ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దృష్టిసారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ