అమరావతి, 24 మే (హి.స.)
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న.. భక్తుల కొంగు బంగారం దుర్గమ్మ తల్లిని దర్శించుకోవటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విజయవాడ వస్తున్నారు. గుడికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాల సమయంలో మార్పులు చేసింది. ఇక నుంచి ప్రతిరోజూ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు వీఐపీ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈఓ శీనా నాయక్ ప్రకటించారు.
ప్రతిరోజూ ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది కార్యక్రమాలు ఉంటాయన్నారు. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 వరకు, నాలుగు క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు వీలైనంత వరకు వీఐపీలు దర్శనాల షెడ్యూల్ పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ