అమరావతి, 24 మే (హి.స.)
అమరావతి, నైరుతి రుతుపవనాలకు సంబంధించి ఐఎండీ (IMD) గుడ్న్యూస్ చెప్పింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ జూన్లో రావాల్సిన రుతుపవనాలు ముందుగానే కేరళలో ప్రవేశించినట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. ఐఎండీ ప్రకారం నైరుతి రుతుపవనాలు ఈరోజు (శనివారం) కేరళలో ప్రవేశించినట్లు వెల్లడించింది. సాధారణ తేదీ కంటే ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని పేర్కొంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళలో ప్రవేశించాయి.
గతంలో 2009వ సంవత్సరం మే 23న ఇలానే ముందుగానే ప్రవేశించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎనిమిది రోజుల ముందుగా నైరుతి రుతుపవనాలు వచ్చేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ రెండో వారంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ పేర్కొంది.
గడిచిన ఐదు సంవత్సరాల్లో రుతుపవనాలు మే చివరన, లేదా జూన్ మొదటి వారంలో కేరళకు వచ్చాయి. ముఖ్యంగా 2023లో అయితే వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి రుతుపనాలు కేరళ తీరాన్ని తాకాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఎనిమిది రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకడంతో ఇక రాష్ట్రంలో కూడా జూన్లోనే వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈసారి ముందే నైరుతి రుతుపవనాల రాకతో అత్యధికంగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ