ఏ.పీ, 25 మే (హి.స.)
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్
సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిల బృందాలలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ఇవాళ(ఆదివారం) పారిస్ కి బయలుదేరి వెళ్ళింది. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్ మీదుగా రాత్రికి పారిస్ కి చేరుకోనుంది.
ఫ్రాన్స్, యుకె, ఈయూ, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ, దేశాలలో పర్యటించి జూన్ 8వ తేదీన భారత్ కి రానున్న ఈ బృందానికి బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తున్నారు. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్', పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉగ్రవాదం గురించి ఈ బృందం వివరిస్తుంది. ఈ బృందంలో పురందేశ్వరితో పాటు బీజేపీ ఎంపీ సామిక్ భట్టాచార్య, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ డా. అమర్ సింగ్, నామినేటెడ్ ఎంపీ గులాం అలీ ఖటాన, ఎంజే అక్బర్, పంకజ్ శరన్ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..